* రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్య
* లింగమయ్య కుటుంబాన్ని రేపు పరామర్శించనున్న జగన్
* చావును రాజకీయం చేసేందుకు వస్తున్నాడన్న పరిటాల సునీత
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి మాటలు విని జగన్ వస్తున్నాడని, ఆయన్ని హెలికాప్టర్ దిగకుండా ఆపే దమ్ము, శక్తి తమకు ఉందని అన్నారు రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ రేపు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను తోపుదుర్తి సోదరులు రాజకీయం చేస్తున్నారని సునీత మండిపడ్డారు. వైసీపీ కార్యకర్త లింగమయ్య మరణంపై బాధ పడిన తొలి వ్యక్తి తానేనని ఆమె చెప్పారు. లింగమయ్యను హత్య చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. చనిపోయిన లింగమయ్య కుటుంబానికి సాయం చేసేందుకు తాను ముందుంటానని చెప్పారు.
తోపుదుర్తి బ్రదర్స్ చెప్పిన మాటలు విని రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయాలు చేయవద్దని జగన్ కు సునీత సూచించారు. గతంలో పరిటాల రవి పులివెందులకు వెళ్లినప్పుడు మీరు అడ్డుకున్నారని జగన్ పై మండిపడ్డారు. వాహనాలను ఆపేసి కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతిని ఇచ్చారని అన్నారు. ఒక చావును రాజకీయం చేయడానికి జగన్ ఇప్పుడు రాప్తాడుకు వస్తున్నాడని విమర్శించారు. బీసీలపై జగన్ కు అంత ప్రేమ ఉంటే… రాప్తాడు ఇన్చార్జిగా బీసీకి అవకాశం ఇవ్వాలని సవాల్ విసిరారు. జగన్ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు సహనం కోల్పోవద్దని సునీత కోరారు.