* సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య డిమాండ్
విజయనగరం జిల్లా: గిరిజనులు సాగు చేస్తున్న అటవీ భూములకు పోడు పట్టాలివ్వాలని, నిరుపేదలకు సొంతింటి కల నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినా పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న ఆశ సామాన్యుల కుటుంబాలకు అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చెప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు ఆధ్వర్యంలో పార్వతీపురంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి నిరసనలు తెలియజేశారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామేశ్వరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జీవన్, జిల్లా నాయకులు ఈవీ నాయుడు, సూరయ్య, గోపినాయుడు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆర్.వి.ఎస్.కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు నాగభూషణం, రవికుమార్, సమితి సభ్యులు పువ్వల ప్రసాద్,బి.టి.నాయుడు, నీలమ్మ, స్థానిక నాయకులు మోహన్ రావు, జనార్థన్ రావు, ఏఐవైఎఫ్ నాయకులు సింహాద్రి కిరణ్, త్రినాథ, చీపురుపల్లి విజయకుమార్ లతోపాటు మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
