శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో ఉన్న 400 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు రాష్ట్ర ప్రభుత్వానివేనని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు హక్కులు దక్కించుకుందని తెలిపారు. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ హెచ్ సీ యూ చెందినది లేదని పేర్కొన్నారు. ఈ భూమిపై సృష్టించే ఏ వివాదమైనా కోర్టు ధిక్కరణే అవుతుందని తెలిపారు. ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా రాజకీయ నాయకులేనని, కొందరు స్థిరాస్తి వ్యాపారులు వారి ప్రయోజనాలకోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు .
ఈ భూమి కేటాయింపులపై ఐఎంజీ అకడమీస్ హైకోర్టులో 2006లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి ఏపీలో రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు ఈ భూమి ప్రభుత్వానిదని వాదనలు వినిపించాయి. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. దీంతో 2024 మార్చి 7న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిని ఐఎంజీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా పటిష్ఠమైన వాదనలు వినిపించడంతో 2024 మే 3న సదరు పిటిషన్ను కొట్టివేసింది. దీంతో 400 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి దక్కాయి.
400 ఎకరాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం మీడియాకు విడుదల చేసింది. వాటిలో ఉన్న సమాచారం ప్రకారం.. కంచ గచ్చిబౌలిలోని హెచ్సీయూకి చెందిన సర్వే నెంబరు 25లోని 534.28 ఎకరాల భూమిని అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి స్వాధీనపర్చింది. దీనికి ప్రతిగా గోపనపల్లిలో సర్వే నంబరు 36, 37లో 397.16 ఎకరాలను ప్రభుత్వం వర్సిటీకి బదలాయించింది. దీనిపై అప్పటి రిజిస్ట్రార్ వై.నరసింహులు సంతకం చేసిన కాపీలను సీఎంవో విడుదల చేసింది.