-
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
-
దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదరం సంజీవయ్యను సీఎంగా చేసింది కాంగ్రెస్
-
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం
TELANGANA ASSEMBLY: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదరం సంజీవయ్యను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నిలబెట్టిందని..సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగిందన్నారు. ఇన్నాళ్లకు తాను సీఎంగా ఉండగానే సమస్య పరిష్కారం అయిందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామన్నారు. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను ఏమాత్రం మార్చకుండా ఆమోదించినట్లు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా సాగిన పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని..ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు.
దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించిందన్నారు. పంజాబ్ కేసు సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా కొనసాగిందని సీఎం రేవంత్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో మన వాదనలు వినిపించినట్లు గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశామని.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి.. న్యాయనిపుణులను సంప్రదించి వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు.
వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచామన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.