* ఎన్డీయేలో ఉన్నందున మేం ఓపెన్ కాలేము..
* డీలిమిటేషన్ గురించి బుచ్చయ్యచౌదరి సంచలన వ్యాఖ్యలు
* మాజీ సీఎం వై.ఎస్.జగన్ పైనా విమర్శలు
రాజమండ్రి: నియోజకవర్గాల పునర్విభజన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గించడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డీలిమిటేషన్ అంశంపై కేంద్రంతో అంతర్గతంగా చర్చిస్తున్నట్టు తెలిపారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించకూడదని ఆయన పేర్కొన్నారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఎంతో బాధ్యతగా వ్యవహరించాయని గుర్తు చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన బుచ్చయ్య చౌదరి..వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. జగన్ మళ్లీ జైలు జీవితం గడపవలసి వస్తుందని స్పష్టం చేశారు. జగన్ పాలనలో పంటలకు బీమా చెల్లించకపోవడంతో రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోయారని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం గ్రామాల్లో కనీసం రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీఎం సహాయ నిధి ద్వారా ప్రజలను ఆదుకుంటున్నామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మే నెలలో తల్లికి వందనం, జూన్లో అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న పుష్కరాలకు రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
ఇక, రాజమండ్రిలో 12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగనుందని, ఈ విషయమై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నితో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. గతంలో వైసీపీ కార్యాలయానికి అధికారులు వెంటనే స్థలం కేటాయించారని, టీడీపీ కార్యాలయానికి స్థలం అడుగుతున్నా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.