DELIMITATION: జనభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనపై తమ వాణిని బలంగా వినిపించేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణకు నడుంకట్టాయి. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో శనివారం నాడు తొలి జేఏసీ సమావేశం జరిగింది. దీనికి కొనసాగింపుగా తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్లో ఉంటుందని స్టాలిన్ ప్రకటించారు. చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నేత కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ పాల్గొన్నారు. కొన్ని అనివార్యకారణాల వల్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ… ఈ సమావేశానికి హాజరుకాలేదు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణకు తమ మద్దతు ఉంటుందని దీదీ బహిరంగలేఖ విడుదల చేశారు.
ప్రజాస్వామ్యబద్ధమైన ప్రాతినిధ్యాన్ని పటిష్టం చేసే ఎలాంటి చర్యలకైనా తాము వ్యతిరేకించడం లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. ప్రాతినిధ్యం తగ్గితే రాష్ట్రాలకు నిధుల విషయంలో పోరాటాలకు దారితీస్తుందని అన్నారు. తమ విద్యార్థులు కీలకమైన అవకాశాలు కోల్పోతారని అన్నారు. మన సంస్కృతి, వృద్ధి ప్రమాదంలో పడతాయని ఆందోళ వ్యక్తం చేశారు. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరగరాదని, దీనిని తాము బలంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రాతినిధ్యం తగ్గితే పార్లమెంటులో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాలను కూడా కోల్పోతామని స్టాలిన్ వెల్లడించారు.
ఎలాంటి సంప్రదింపులు లేకుండానే డీలిమిటేషన్ ప్రక్రియతో కేంద్రం ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఇందులో స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంటులో సీట్లు పెరిగితే…. దక్షిణాది రాష్ట్రాలకు తగ్గుతాయని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి బాగా కొలిసొస్తుందని కేరళ సీఎం పేర్కొన్నారు.
డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రం అన్ని పార్టీలతో చర్చలు జరపాలని ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సూచించారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.