పేదరికంతో బతుకులు వెళ్ళదీస్తున్న ఆ జీవితాల్లో… బాణాసంచా తయారీతో నైనా వెలుగులు నిండుతాయని అనుకున్నవారి జీవితాలు చివరికి బుగ్గిపాలయ్యాయి. పచ్చటి పొలాల మద్య ఒక్కసారిగా భారీ పేలుళ్లతో అక్కడి నేల భీతావాహమై కంపించిపోయింది. ఏమైందో ఏమో తెలుసుకునేలోపే…భారీ ప్రాణనష్టం సంభవించింది. ఎగసిపడే మంటల్లో, ధ్వంసమైన రేకుల షెడ్ల శిథిలాల కింద ఐదుగురి మృతదేహాలు ఛిద్రమై పడి ఉన్నాయి. కొందరి శరీరాలు కాలిపోయాయి. కొందరి కాళ్లు, మొండెం, తల వేరుపడి చెల్లాచెదురుగా పడిపోయాయి. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారులోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలోనే ఐదుగురు చనిపోగా, కొన ఊపిరితో ఆసుపత్రిలో చేరిన వారిలో ముగ్గురు మృతిచెందారు. మరో 8 మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. వారిలోనూ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
కైలాసపట్నానికి కిలోమీటరు దూరంలో విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ పేరిట బాణసంచా తయారీ కేంద్రం నడుపుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తేరుకునేలోపే భారీ పేలుళ్లు సంభవించాయి. మందుగుండు సామగ్రి నిల్వలు, తయారీకి కేటాయించిన మూడు షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటి శిథిలాలు, ఇటుకలు 300 మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. షెడ్డులో బాణసంచా తయారీలో నిమగ్నమైన కార్మికులు దాడి రామలక్ష్మి, పురం పాప, గుప్పిన వేణుబాబు, సేనాపతి బాబూరావు, హేమంత్లు అక్కడికక్కడే మృతిచెందారు. వీరి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఛిద్రమయ్యాయి. మాంసపు ముద్దలపై మసి, దుమ్ము పేరుకుంది. ఘటనా స్థలికి అర కి.మీ. దూరంలోని పొలంలో పని చేసుకుంటున్న ఓ రైతు ఈ విస్ఫోటాన్ని తొలుత గుర్తించారు. వెంటనే గ్రామస్థులకు సమాచారమిచ్చారు.
మధ్యమధ్య పేలుళ్లు సంభవిస్తుండటంతో సాహసించి ముందుకు వెళ్లలేకపోయారు. చివరకు కొందరు ధైర్యం చేసుకుని వెళ్లి కొన ఊపిరితో ఉన్న అప్పలకొండ తాతబాబు, సంగరాతి గోవింద్, దేవర నిర్మలను అక్కడే ఉన్న నిర్వాహకుడి వాహనంలో కోటవురట్ల సీహెచ్సీకి తరలించారు. కొద్దిసేపటికే ఆ ముగ్గురూ మృతిచెందారు. ప్రమాదం జరిగిన 45 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపు చేశారు. మరో ఆరుగురిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. వారిలో జల్లూరు నాగరాజు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఐదుగురి మృతదేహాలను నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి, మూడు మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం అధికారులు తరలించారు.
ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులు తెలిపిన సమాచారం మేరకు గడ్డకట్టిన మందుగుండును మిశ్రమంగా మలిచేందుకు కర్రతో ఆరుబయట కొడుతుండగా మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఉగాది తర్వాత పరిసర ప్రాంతాల్లో గ్రామదేవతల పండుగలు ఎక్కువగా ఉన్నందున బాణసంచా ఆర్డర్లు బాగా వచ్చినటు తెలుస్తోంది.