భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ,మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు దాదాపు 9 నెలల అనంతరం మార్చి 19న వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్లో భూమిపై అడుగుపెట్టారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు సైతం వాహకనౌకలో వచ్చారు. 12 రోజుల అనంతరం తొలిసారి వారు బాహ్య ప్రపంచం ముందుకు వచ్చారు. నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సునీతా, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మాట్లాడారు.
తనకిప్పుడు బాగానే ఉందని… అంతేకాకుండా అవకాశం వస్తే మళ్ళీ స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు వెళ్తామని సునీతా విలియమ్స్ తెలిపారు.
అందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ.. బోయింగ్, నాసా కట్టుబడి ఉన్నందున స్టార్లైనర్లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కస్తామని పేర్కొన్నారు.
తమ మిషన్ విజయవంతం కావడానికి సహాయం చేసిన నాసా బృందాలకు సునీతా ధన్యవాదాలు తెలిపారు. గతంలో తీసుకున్న శిక్షణ మమ్మల్ని ఐఎస్ఎస్కు తీసుకువెళ్లేలా సిద్ధం చేసిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మిషన్ కంట్రోల్ బృందాలు తాము తిరిగి భూమిపైకి రావడంలో, పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధకావడానికి ఎంతో సహాయం చేశాయన్నారు. తాను మళ్లీ సాధరణంగా స్థితికి రావడానికి సహాయం చేసిన శిక్షకులకు సునీతా ధన్యవాదాలు తెలిపారు. తాను ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు టాస్క్ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని తెలిపారు.