వివాదాస్పద ఐపీఎస్ ఆఫీసర్ గా పేరున్న ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయి నటి జత్వానీకి వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్ళారు. వైకాపా హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. మాజీ సీఎం జగన్కు ఆయన అత్యంత విధేయుడిగా ఉన్నారు. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు.
ఈ కేసులో… పీఎస్ఆర్ ఆంజనేయులు రెండో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. జత్వానీ వ్యవహారంలో వైకాపా ముఖ్యనేత చెప్పగానే పీఎస్ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగి…ఆమెపై ఏ కేసు పెట్టాలి.. ఎలా అరెస్ట్ చేయాలనే విషయాలను అన్నీ తానై చూసుకున్నారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ను పిలిపించి జత్వానీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాల్ని సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు.
ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగానే… ముంబయి వెళ్లి జత్వానీ, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం జరిగింది. రిమాండ్కు పంపడం తదితర వ్యవహారాలను కాంతిరాణా, విశాల్ గున్నీ పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకాపా హయాంలో అధికారులు తమపట్ల వ్యవహరించిన తీరుపై జత్వానీ ఫిర్యాదు చేయడంతో… విద్యాసాగర్తో పాటు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్గున్నీలపై కేసు నమోదు చేశారు.