అనేక దేశాలపై అధిక సుంకాలు విధించి కాళ్ళబేరానికి వస్తున్నాయన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఉన్న 10శాతమే అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే చైనాతో మాత్రం కయ్యానికి మరింత కాలుదువ్వారు. ఆ దేశంపై ఏకంగా 125 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. దానికి ప్రతీకారంగా చైనా.. అంతే దీటుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84 శాతం సుంకాలను విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలూ తగ్గేదే లేదంటూ…. ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయంతో …. అమెరికా మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి.
మరోవైపు ప్రతీకార సుంకాలతో అమెరికా, చైనా చెలరేగిపోతున్నాయి .తొలుత చైనాపై 20 శాతం సుంకాలను ట్రంప్ విధించారు. ఆ తర్వాత దానికి అదనంగా 34 శాతం విధిస్తున్నట్లు ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. దీంతో అది 54శాతానికి చేరింది. దీనికి ప్రతీకారంగా అమెరికాపై 34 శాతం సుంకాలను చైనా ప్రకటించింది. దీంతో ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. చైనా వెనక్కి తగ్గకపోతే అదనంగా మరో 50 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. అయినా చైనా పట్టించుకోలేదు. దీంతో బుధవారం నుంచి 50 శాతం కలిపి మొత్తం సుంకాలను ట్రంప్.. 104 శాతానికి చేర్చారు. తాజాగా అది 104 నుంచి 125 వరకు చేరింది.
సుంకాలపై చర్చలకు తమకు ఎటువంటి ఆసక్తి లేదని, ఒకవేళ అమెరికా చర్చల కోసం ముందుకొస్తే.. సమానత్వ ప్రాతిపదికన అప్పుడు ఆలోచిస్తామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ బుధవారం స్పష్టం చేశారు.