* కన్న పిల్లలను కాలువలోకి తోసేసిన తండ్రి
* ప్రాణాలు కోల్పోయిన ఏడేళ్ల పాప
* పిల్లలను కాలువలోకి తోసి అదృశ్యమైన పిల్లి రాజు
CRIME NEWS: ఇదెక్కడి ఖర్మరా నాయినా. ఇబ్బందులెదురైతే ధైర్యంగా ఎదుర్కోవాల్సింది పోయి..ఈ చంపడాలు, చావడాలెంటి? 30, 35 ఏళ్లకే..కష్టమొచ్చిందని లోకం తెలియని పసిపిల్లలను బలితీసుకుంటే ఎలా. మరి 30 ఏళ్లలో..ఎన్ని కష్టాలొచ్చినా వాటిన్నింటిని ఎదుర్కుని తల్లిదండ్రులు మనల్ని పెంచలేదా? వాళ్లు మనలానే ఆలోచించి ఉంటే..మనం ఈ భూమ్మీద ఉండేవాళ్లమా?
కష్టాల్లో ధైర్యంగా నిలవాల్సిన తండ్రే కాలయుముడిలా ప్రాణాలు తీస్తున్నారు. అండగా ఉండాల్సిన నాన్న..నాకెందుకు ఈ భారమంటూ చంపేస్తున్నారు. పోటీ ప్రపంచంలో తన పిల్లలు బతకలేరన్న నెపంతో ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కాకినాడ ఉదంతం మరువక ముందే కోనసీమ జిల్లాలో మరో ఘటన..ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక..పిల్లలను కాలువలో పడేసి తండ్రి అదృశ్యమైన ఘటన..కలకలం రేపుతోంది.
కోనసీమ జిల్లా వెంటూరులో విషాదం నెలకొంది. పిల్లి రాజు అనే వ్యక్తి..తన ఇద్దరు పిల్లలు సందీప్, కారుణ్యలను..బైక్ పై తీసుకెళ్లాడు. ఊరంతా తిప్పుతానంటూ బయటకు తీసుకెళ్లి. రాజునెలపర్తిపాడులోని గణపతిలాకుల వద్దకు తీసుకుని వెళ్లాడు. అక్కడ నిర్మానుష్యంగా ఉండడంతో ఇద్దరి పిల్లల్ని కాలువలోకి తోసేశాడు. పదేళ్ల కుమారుడు సందీప్ ఈతకొట్టుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ చిన్నారి కారుణ్య తండ్రి కర్కశత్వానికి బలైంది. ఆర్థిక ఇబ్బందులే పిల్లి రాజు ఇలా చేశాడని స్థానికులు అంటున్నారు. కుమార్తె మరణంతో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది.
తమను స్కూటీపై తీసుకొచ్చిన తండ్రి ఏమయ్యాడో తెలియదని సందీప్ పోలీసులకు తెలిపాడు. మరి పిల్లిరాజు ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్లాడు? తానూ ఆత్మహత్య చేసుకున్నాడా? శవమేమైంది? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.