* కమిషనర్ కు సీఐటీయూ నేతల వినతి
అమరావతి: రాజధానిలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు సీహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. విజయవాడ సీఆర్డీయే కార్యాలయంలో కమిషనర్ కన్నబాబును బాబురావుతోపాటు పలువురు సీఐటీయూ నాయకులు ఇవాళ కలిశారు. రాజధాని ప్రాంత కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతిలోని అసెంబ్లీ, రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, రాజధాని గ్రామాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ ఉన్న ఫిబ్రవరి నెల జీతాన్ని వెంటనే చెల్లించాలని కోరారు.
రాజధాని అమరావతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని, రాజధానిలో పనిచేస్తున్న కార్మికుల బతుకులను మాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు. మార్చి 17వ తేదీ వచ్చినా ఇప్పటివరకు అసెంబ్లీ, సచివాలయం, రాజధాని గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోతే కుటుంబాలను ఎలా గడుస్తాయని అన్నారు. రాజధాని కార్మికులకు ఏ రోజు జీతాలు చెల్లిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.రాష్ట్రమంతా పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికులకు 21 వేల రూపాయలు జీతం ఇస్తూ రాజధాని అమరావతిలోను, అసెంబ్లీలో, సచివాలయంలో, హైకోర్టులో, గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మాత్రం రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని.. ఈ వివక్ష ఎందుకని బాబురావు ప్రశ్నించారు.
ఇస్తున్న అరకొర జీతం కూడా ఏ నెలకు ఆ నెల సక్రమంగా చెల్లించకుండా కార్మికుల కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సచివాలయంలో, రాజధాని గ్రామాల్లో కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో ఉన్న కార్మికులపై పని భారం పడి కార్మికుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే అధికారులు స్పందించి రాజధానిలోని అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, గ్రామాల్లో పనిచేస్తున్న కార్మికులకు 21 వేల రూపాయలకు జీతం పెంచాలని,ప్రతి నెల జీతాలు సక్రమంగా చెల్లించాలని, కార్మికులకు నిలిపివేసిన రాజధాని సామాజిక పెన్షన్ పునరుద్ధరించాలని బాబురావు తదితర నేతలు డిమాండ్ చేశారు. కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన వారిలో సీఐటీయూ అమరావతి డివిజన్ నాయకులు ఎం.రవి, ఎం.భాగ్యరాజు, బుజ్జి, శ్రీలత, చిట్టిబాబు, శాంతకుమారి తదితరులు ఉన్నారు.
