కార్పోరేషన్ కంపెనీలకు ….లక్షల ఎకరాలు ధారాదత్తం చేసే కూటమి ప్రభుత్వం విశాఖ ఋషి కొండని 99 పైసలకే అప్పనంగా కట్టబెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య విమర్శించారు. పేదోడికి 2 సెంట్లు ఇంటి స్థలం అడిగితే లేదనీ చెప్పడం చంద్రబాబు మోసకారితానానికి నిదర్శనమని… కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకూ… పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడలేదని అన్నారు .
పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలాలు ఇచ్చి… ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ప్రభుత్వ ఆర్థిక సాయం చేయాలని… ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఉన్న చోటే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని… మంగళవారం ఉదయం సీపీఐ విజయనగరం జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలక్టరేట్ ముందు ధర్నాచేసిన అనంతరం డి.ఆర్.ఓ కు వినతిపత్రం అందజేసారు.
ఈశ్వరయ్య మాట్లాడుతూ…. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేద కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందిస్తే ఎంతో.. మేలు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగలేదని… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… ఇళ్లు కట్టుకునేందుకు స్థలం ఉన్నవారు చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. 2014-19 టీడీపీ పాలనలో ఇదే పరిస్థితి నెలకొందని… మొదటి మూడేళ్లపాటు ఇళ్ల నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండా తర్వాత ఇచ్చారని విమర్శించారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గృహనిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.
పట్టణ ప్రాంతంలో అయితే… రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అనేకసార్లు అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని…ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు పాలించిన జగన్ రెడ్డి రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు నిర్మిస్తామని… రాబోయే కాలంలో ఇల్లు అడిగే పేదవారు లేకుండా చేస్తానని వాగ్దానం చేసి చేతులెత్తేసారని ఆరోపించారు. టిడ్కోఇళ్ళను లబ్దిదారులకు పూర్తిగా అప్పగించకుండా… నెలలు గడుస్తున్నాయన్నారు.