పొట్టచేతపట్టుకొని… ఉన్న ఊరిని వదిలి పెట్టి విదేశానికి వెళ్ళిన ఓ మహిళపై యజమానులు యాసిడ్ దాడికి పాల్పడ్డ ఘటన వెలుగులోకివచ్చింది. యాసిడ్ దాడి చేసి పిచ్చాసుపత్రిలో చేర్పించర్చారు యజమానులు . ఆసుపత్రి సిబ్బంది ఫోన్ ద్వారా బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త మృతి చెందడంతో ఉపాధి కోసం రెండు నెలల క్రితం వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లారు. అక్కడి ఇంట్లో పనిచేయాలని, 150 దీనార్లు వేతనంగా ఇస్తామని ఒప్పందం జరిగింది. ఉద్యోగంలో చేరాక యజమానులు 100 దీనార్లే ఇవ్వడంతో లక్ష్మి వారిని ప్రశ్నించారు. దీంతో వారు ఆగ్రహంతో… ఆమెపై యాసిడ్ పోసి, ఆపై పిచ్చాసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన జరిగి పది రోజులు అవుతుండగా… బాధితురాలు కొంచెం కోలుకున్న తర్వాత ఆసుపత్రి యాజమాన్యానికి జరిగిన విషయం చెప్పడంతో… వారు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. బాధితురాలి పాస్పోర్టు ఇంటి యజమానుల దగ్గర ఉండిపోవడంతో కేసు వెనక్కి తీసుకుంటేనే ఇస్తామని వారు వేధిస్తున్నారు. ఏం చేయాలో అర్ధంకాక ఆమె పిచ్చాసుపత్రిలోనే మగ్గిపోతున్నారు. ఏజెంట్ను సంప్రదిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రభుత్వమే స్పందించి లక్ష్మిని స్వగ్రామానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.