రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కొత్త చర్యలు చేపడుతోంది. సాంకేతిక వినియోగమే ఉత్తమమని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన నేపథ్యంలో గూగుల్తో ఒప్పందానికి టీటీడీ సిద్ధమవుతోంది. ఇందుకు కృత్రిమ మేధ(ఏఐ)ను ఉచితంగా అందించడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. వారం, పది రోజుల్లో టీటీడీ-గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం కుదరనుంది. తర్వాత గూగుల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కసరత్తు పూర్తిచేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐని వాడతారు. ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేస్తారు. ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఏఐని వినియోగిస్తున్నా భక్తులకు సమాచారం అందించడానికే పరిమితమయ్యాయి.
గూగుల్ మ్యాప్ల ద్వారా ఎప్పటికప్పుడు పలుచోట్ల రద్దీ గురించి భక్తులు సులభంగా తెలుసుకోవచ్చు. సామాన్యులు ఎక్కువగా గదుల కోసం వచ్చే కేంద్రీయ విచారణ కార్యాలయం, ఆరోగ్య కేంద్రాలు, అన్న ప్రసాద కేంద్రం, కల్యాణకట్ట వద్ద రద్దీ ఎలా ఉందో ఎవరినీ అడగకుండా ఫోన్ ద్వారానే సమాచారం రాబట్టవచ్చు. ఫోన్లకే నోటిఫికేషన్లు వస్తాయి. దీనివల్ల టీటీడీకీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది…. కానీ భక్తులకు స్మార్ట్ ఫోన్ అనుమతించకపోతే…. ఏఐ(గూగుల్) సేవలు ఏలా.. వినియోగించుకుంటారు అన్నది కొసమెరుపు. ఒక వేళ అనుమతిస్తే..అది మరో సమస్యకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు. మరి టీటీడీ కొత్త చర్యలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.