* పుట్టిన రోజు నాడే.. అమ్మాయి తండ్రి ఘాతుకం
* కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబం
తెలంగాణలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. వేరే కులానికి చెందిన యువకుడు తన కూతురిని ప్రేమించినందుకు కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశాడో తండ్రి. దీంతో బాధిత యువకుడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్.. అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేర్వేరు కావడంతో వీరి ప్రేమకు యువతి తండ్రి అభ్యంతరం చెప్పాడు. ఇక నుంచి తన కూతురితో మాట్లాడొద్దని సాయికుమార్ ను హెచ్చరించాడు. అయినా.. అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన యువతి తండ్రి ఎలాగైనా సాయికుమార్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నిన్న రాత్రి (గురువారం) 10 గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో కలిసి కూర్చొని ఉండగా.. యువతి తండ్రి గొడ్డలితో వచ్చి అకస్మాత్తుగా దాడి చేశాడు. విచక్షణారహితంగా సాయికుమార్ పై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సాయికుమార్ స్నేహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటీన సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు.
సాయికుమార్ మృతి వార్త పెద్దపల్లి జిల్లాతోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
