MEGA DSC: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూ తీపి కబురు అందించారు.
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం కలెక్టర్లతో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. 25, 26 తేదీల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కలెక్టర్లు కృషిచేయాలని ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్, ఉద్యోగాల కల్పన, రాష్ట్ర అభివృద్ధి. ఇన్ కం జనరేటింగ్ వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు.
అయితే గత ఐదేళ్లలో రాష్ట్రం దివాళా తీసిందని ముఖ్యమంత్రి అన్నారు. ఒక వ్యక్తి అరాచకంతో..ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని వ్యాఖ్యానించారు. ఇక వారి మీద నమ్మకం లేక వైసీపీని ప్రజలు ఆమోదించలేదని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతోనే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకెళ్తుందని చంద్రబాబు అన్నారు.
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. ఈ ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా మే నెలలో తల్లికి వందనం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఇక 2027 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు 5 కోట్ల ఆంధ్రుల కల..రాజధాని అమరావతిని త్వరలో ప్రజలకు అందివ్వనున్నట్లు ప్రకటించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి సంస్థల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నామన్నారు.. ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా ఈ అప్పులు తీర్చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై..తొలిరోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల పనితీరు ప్రజలపై శాశ్వతమైన ప్రభావం చూపుతుందని, వారి పనితీరును నిరంతరం సమీక్షిస్తామని అన్నారు. ప్రజా సంక్షేమం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. ఈ ప్రభుత్వం తమ కోసమే పనిచేస్తోందనే నమ్మకం ప్రజల్లో కలిగించాలని అన్నారు. మంత్రులు కూడా తమకెందుకులే అని ఉండకుండా….కలెక్టర్లతో కలిసి పనిచేయాలని సూచించారు.
రాష్ట్ర అభివృద్ధికి విజన్ 2047 ఒక దిక్సూచిలాంటిదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయం వరకు ప్రణాళికలు ఉండాలని, జిల్లాలో కలెక్టర్ విజన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా వ్యవహరిస్తారని తెలిపారు. ఇలా గ్రామస్థాయి వరకూ ప్రణాళికలూ అమలయ్యేలా చూడాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఈ వేసవిలో నీటి ఎద్దడి ప్రాంతాలను కలెక్టర్లే గుర్తించి..తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. అందులో పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు.