YEDIYURAPPA: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్పకు..స్వల్ప ఊరట దక్కింది. బాలికపై లైంగిక దాడి ఆరోపణల కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన సమన్లపై కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది. మార్చి 15న విచారణకు హాజరుకావాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ..యడియూరప్ప కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం..మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న 17ఏళ్ల బాలికపై యడియూరప్ప గతంలో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతేడాది ఫిబ్రవరి 2న ఒక కేసులో సాయం కోరుతూ బాలిక తన తల్లితో కలిసి యడియూరప్పను ఆయన నివాసంలో కలిసింది. ఆ సమయంలోనే యడియూరప్ప బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీనిపై సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి విచారణకు కేసును సీఐడీకి అప్పగించారు. సీఐడీ తిరిగి FIR రిజిస్టర్ చేసి, చార్జిషీటును కూడా నమోదు చేసింది. అయితే లైంగిక దాడి ఆరోపణలను యడియూరప్ప ఆఫీస్ ఖండించింది.