విజయవాడ: పేదల ఇళ్ల స్థలాలు, పట్టాల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు హెచ్చరించారు. విజయవాడలో పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన 10వేల ఇళ్లను ఆరేళ్లుగా కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు పేదలు అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతుండగా… మరోవైపు వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా మారి అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో జవహర్లాల్ నెహ్రూ (JNNURM) స్కీం కింద నిర్మించిన జీ ప్లస్ త్రీ వందలాది ఇళ్ళ సముదాయాన్ని బాబురావుతోపాటు మరికొందరు సీపీఎం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇళ్లు కేటాయించకపోతే పేదలే స్వాధీనం చేసుకుంటారన్నారు. నిర్మాణం పూర్తయి ఏడేళ్లు కావొస్తున్నా.. ఆ ఇళ్లు నిరుపయోగంగా ఉండటంతో దెబ్బతినిపోయి దుర్గంధంతో ఉన్నాయని, మందు బాటిల్లు, వ్యర్ధ పదార్థాలతో నిండిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు జక్కంపూడిలో ఏడేళ్ల క్రితం నిర్మించిన టిడ్కో ఇళ్ల కోసం ఒక్కొక్క కుటుంబం 70వేల రూపాయల చొప్పున చెల్లించినా.. ఇంతవరకు ఇళ్ల కేటాయింపు జరగలేదన్నారు. ఇళ్ల కేటాయింపు జరగకపోవడంతో బ్యాంకులకు వడ్డీతో సహా బకాయిలు చెల్లించాల్సి వస్తోందని బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతున్నాయి తప్ప.. పేదల తల రాతలు మారడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే పేదలకు ఇళ్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
