* శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
* దోహా నుండి బంగ్లాదేశ్ వెళుతోన్న విమానం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ వేస్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో ఉన్న ఒక మహిళకు గుండెపోటు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆమెను వెంటనే విమానాశ్రయంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందారు. ఈ విమానం దోహా నుండి బంగ్లాదేశ్ వెళుతోంది. దోహా నుండి బంగ్లాదేశ్లోని ఢాకాకు వెళుతున్న క్యూఆర్-642 విమానం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్ కంట్రోలర్ అనుమతిని కోరింది. సంబంధిత శాఖల నుండి అనుమతి వచ్చాక మధ్యాహ్నం 3.25 గంటలకు విమానాన్ని ల్యాండింగ్ చేశారు. గుండెపోటుకు గురైన ప్రయాణికురాలి కోసం విమానాశ్రయ సిబ్బంది విమానాశ్రయంలో అంబులెన్సును సిద్ధంగా ఉంచారు. ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణం దక్కలేదు.