ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా… తృటిలో ప్రాణాపాయం నుంచి విద్యార్థులు భయటపడ్డారు. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా చల్లారు. సిబ్బంది అప్రమత్తతతో స్కూల్లోని 30 మంది విద్యార్థులకు పెను ముప్పు తప్పింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం, ఆదివారం సెలవులు రావడంతో సిబ్బంది పాఠశాలలో వంట గదికి తాళం వేసి వెళ్లారు. సోమవారం ఉదయం వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో చెడు వాసన, నురగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. తాగు నీటి ట్యాంకులోనూ దాన్ని కలిపినట్లు వారు గుర్తించారు. విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనపై పాఠశాల హెచ్ఎం ప్రతిభ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విషయం తెలిసిన స్థానికులు దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఇంత ఘాతుకానికి పాల్పడ్డ వారిని
తక్షణమే పట్టుకొవాలని….దీన్ని గమనించిన స్కూల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు పిల్లల తల్లిదండ్రులు