చిత్తూరు నగరంలో మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి కన్నవారింట మృత్యుఒడిలోకి చేరుకుంది. తన భార్యను పుట్టింటి పంపిన గంటలోనే చంపేసి, మార్చురీలో శవాన్ని చూపించారనీ…మృతురాలి భర్త తీవ్రంగా విలపించారు.
బాలాజీనగర్ కాలనీకి చెందిన షౌకత్అలీ, ముంతాజ్ల కుమార్తె యాస్మిన్బాను(26) ఎంబీఏ పూర్తిచేయగా…. పూతలపట్టు మండలానికి చెందిన కోదండరామ్, బుజ్జిల కుమారుడు సాయితేజ బీటెక్ చదివారు. కాలేజీ రోజుల్లో వీరి మధ్య పరిచయం ఏర్పడి….పెళ్లికి దారితీసింది. ఎస్సీ వర్గానికి చెందిన సాయితేజతో వివాహానికి యాస్మిన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ప్రాణహాని ఉందని భావించిన ఇద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కల్పించాలని అదేనెల 13న తిరుపతి డీఎస్పీని ఆశ్రయించడంతో….ఇరు కుటుంబాలను పిలిచి, కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
వీరి సంసారం సాఫీగానే సాగుతోంది అనుకునే సమయంలోనే….. యాస్మిన్ కుటుంబీకులు ఫోన్లో మాటలు కలిపి తండ్రి షౌకత్అలీకి ఆరోగ్యం సరిగా లేదని ఓసారి వచ్చి, చూసి వెళ్లాలని యాస్మిన్ను పదేపదే కోరారు. ఆదివారం ఉదయం సాయితేజ.. తన భార్యను చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలి వద్ద ఆమె సోదరుడి కారులో ఎక్కించి, తల్లిగారింటికి పంపారు. కాసేపటికే సాయితేజ తన భార్యతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా కలవకపోవడంతో నేరుగా వారి ఇంటికి వెళ్లాడు. యాస్మిన్ ఇంట్లో లేదని ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వాస్పత్రి శవాగారంలో ఉందని కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా బదులిచ్చారు.
ఆందోళనతో అక్కడికి వెళ్లిన సాయితేజ.. మార్చురీలో భార్య శవాన్ని చూసి బోరున విలపించారు. మతాలు, కులాలు వేరు కావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు తమ పెళ్లిని వ్యతిరేకించారని…. తుదకు తన భార్యను చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సాయితేజ రోదించారు. మరోవైపు యాస్మిన్ తండ్రి, ఆమె పెద్దమ్మ కొడుకు (సోదరుడు) లాలూ పరారయ్యారు. చిత్తూరు ఇన్ఛార్జి డీఎస్పీ ప్రభాకర్, టూటౌన్, వన్టౌన్ సీఐలు నెట్టికంఠయ్య, మహేశ్వర్లు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.