రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతల నడ్డివిరిచాయి. ఆదివారం కురిసిన వర్షాలతో జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పది వేలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వడగళ్ల వానలతో పలు గ్రామాల్లో మామిడికాయలు, ధాన్యం గింజలు రాలిపోయాయి. పలుచోట్ల వ్యవసాయ మార్కెట్లకు రైతులు తెచ్చిన ధాన్యం వాననీటికి కొట్టుకుపోయింది. జనగామలోని ఆర్టీసీ డిపో ఆవరణలో భారీ వృక్షం కూలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని చామాపూర్లో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. ఖమ్మం- దేవరాపల్లి పాత జాతీయ రహదారిపై ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి-సీతారాంపురం సమీపంలో చెట్లు పడిపోవటంతో రెండువైపులా 4 కి.మీ. మేర రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి.
రాష్ట్రంలో మార్చి నాలుగో వారం నుంచి ఇప్పటివరకు అకాల వర్షాలతో 50 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ నివేదించింది. 8 వేల ఎకరాల్లోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. మార్చి నెలాఖరు నుంచి ఈ నెల 2 వరకు కురిసిన వర్షాలతో 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నివేదించగా.. ఎకరానికి రూ.10 వేల చొప్పున సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3వ తేదీ నుంచి 8 వరకు మరో 14,956 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు నివేదిక అందగా… దానిపై రైతువారీ సర్వే వివరాలు వచ్చాక ఈ నెల 20న పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 10 నుంచి ఆదివారం వరకు మరో 26 వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు తాజా నివేదిక వెల్లడించింది. దీనిపై ఈ నెల 25న పరిహారం ప్రకటించే వీలుంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. సోమవారం ఖమ్మం, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళ, బుధవారాల్లో భద్రాద్రి, ఖమ్మం, ములుగు, జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది.