గాజు వంతెనలు, భారీ నిర్మాణాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా… చైనా మరోసారి ఇంజినీరింగ్ అద్భుతం చేసింది. ఓ భారీ లోయపై రెండు మైళ్ల పొడవుతో వంతెనను నిర్మించి వారెవ్వా అనిపించుకుంది. ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం…. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జ్గా చరిత్ర సృష్టించింది. ఈ వంతెన నిర్మాణంతో గంట సమయం పట్టే ప్రయాణాన్ని నిమిషంలోనే పూర్తి చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.
గుయ్ఝౌ ప్రాంతంలోని బీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో ఈ ‘హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జి’ని నిర్మించారు. 2022లో నిర్మాణాన్ని ప్రారంభించి కేవలం మూడేళ్లలోపే పూర్తి చేయడం విశేషం. ఈ ప్రాజెక్ట్ కోసం 280 మిలియన్ డాలర్లు ఖర్చు చేసారు. ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తు, మూడు రెట్ల బరువుతో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఈ ఏడాది జూన్లోని ఈ వంతెనను ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యంతో పాటు పర్యటక ప్రాంతంగానూ ఈ వంతెన నిలవనుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో ఇలాంటి భారీ వంతెన నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనల్లో దాదాపు సగం ఈ దేశంలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.