సుంకాల విషయంలో… అమెరికాతో భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాతో వాణిజ్యాన్ని రెండున్నర రెట్లు పెంచుకోవడంపై తాము దృష్టి సారించామని పేర్కొన్నారు. వివిధ దేశాలపై విధించిన సుంకాలను ట్రంప్ 90 రోజుల పాటు నిలిపివేసిన వేళ… ఆయన ముంబయిలో విలేకరులతో మాట్లాడారు.
ద్వైపాక్షి సంబంధాలను, సులభతర వాణిజ్యం కోసం ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో… ఇరు దేశాలు ఫిబ్రవరిలోనే ఓ ఒప్పందం చేసుకున్నాయని గోయల్ అన్నారు. దీనివల్ల ఇరు దేశాల వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. గతంతో పోలిస్తే ఈ మొత్తం రెండున్నర రెట్లు అధికం అన్నారు. దీనివల్ల మరింత మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి ఉందని, ఇందులో భారత్దే పైచేయి అని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అంతకుముందు వాణిజ్య ఒప్పందాలపై పరిశ్రమ వర్గాల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. వాణిజ్యం గురించి మాట్లాడారు.