మాజీ ఎంపీ, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పై కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి దర్యాప్తునకు తప్పక సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైకాపా అధికారంలో ఉండగా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఆమె పనిచేశారు. రఘురామపై కస్టోడియల్ టార్చర్లో ఎలాంటి గాయాలు కాలేదని అప్పట్లో నివేదిక ఇచ్చారు.
ఈ అంశం పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 7,8 తేదీల్లో సంబంధిత పోలీస్స్టేషన్లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరుకావాలని… ప్రభావతిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు చెప్పినా దర్యాప్తునకు సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ఒక్కసారే విచారణకు పిలిచారని.. రెండు నెలల్లో మళ్లీ పిలవలేదని ప్రభావతి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎప్పుడు నోటీసులు పంపినా.. ప్రభావతి తప్ప ఎవరో ఒకరు స్పందిస్తున్నారని సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది.