విదేశి ఉత్పత్తులపై అధిక సుంకాల విధింపుతో ప్రతీకారానికి సిద్ధమవుతుంది అమెరికా. భారత్ తో సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాల ఉత్పత్తులపై సుంకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది . అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. లేటెస్ట్ గా వైట్హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ… అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు వసూలు చేస్తోందని అన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాల వల్ల అమెరికా ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారుతోందని తెలిపారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.
తమ ఉత్పత్తుల పై అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాను కరోలిన్ మీడియాకు చూపించారు. కొన్ని దేశాలు చాలా కాలంగా మమ్మల్ని టారిఫ్ల రూపంలో పీల్చేస్తున్నాయని తెలిపారు. అమెరికా డెయిరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50శాతం సుంకాలు వసూలు చేస్తోందని తెలిపారు. అమెరికన్ల వ్యాపారాలు చాల వరకు దెబ్బతింటున్నాయి అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయం అని తెలిపారు.
వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక మార్పును తీసుకురాబోతున్నారని కరోలిన్ అన్నారు. బుధవారం (ఏప్రిల్ 2)నుంచి అమల్లోకి రాబోతున్నాయని తెలిపారు. పరస్పర ప్రతీకార సుంకాల విషయంలో మేం శాశ్వత నిర్ణయం తీసుకోబోతున్నామని ఇప్పటికే ట్రంప్ తెలిపారు.
ప్రతీకార సుంకాలు అన్ని దేశాలపై ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా మేం అన్ని దేశాలతో ఉదారంగా వ్యవహరించాం. కానీ చరిత్రలో ఏ దేశాన్నీ దోచుకోని విధంగా అవి అమెరికాను దోచుకున్నాయి. వాణిజ్య పాలసీల విషయంలో కొన్నిసార్లు అమెరికా మిత్ర దేశాలు.. శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయి.